సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందాయి. ఈ రెండు చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆతర్వాత వీరిద్దరూ మళ్లీ ఓ సినిమా చేయాలి అనుకున్నారు అయితే.. కొన్ని కారణాల వలన సెట్ కాలేదు. ఆఖరికి 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సెట్ అయ్యింది.
ఈ క్రేజీ మూవీ ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెలలో సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటే.. మహేష్ మోకాలికి సర్జరీ చేయించుకోనున్నాడు. అందుచేత ఐదు నెలల వాయిదా పడనుందని వార్తలు వచ్చాయి. తాజా అప్ డేట్ ఏంటంటే… ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి షూట్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. పైగా మొదట ఓ సాంగ్ తో షూట్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ సాంగ్ ను జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారని తెలిసింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని టాక్ వినిపిస్తోంది. ఇందులో నటించే నటీనటులు ఎవరు అనేది త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాను 2022 దసరాకి రిలీజ్ చేయాలనేది ప్లాన్.