ఎన్టీఆర్ ఫ్యామిలీలో అరుదైన కలయిక

వేడుక అనే మాటలోనే ఓ దగ్గరతనం ఉంటుంది. అది ఎందరినో దగ్గర చేస్తుంది కూడా. అలా ఎన్టీఆర్ కుటుంబ వేడుక కూడా ఇలాంటి ఓ అరుదైన కలయికకు వేదిక అయింది. నటుడుగా తెలుగు వారి ఖ్యాతిని ఎల్లలు దాటించిన ఎన్టీఆర్.. ముఖ్యమంత్రిగా పరిపాలనలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇక చాలాపెద్ద కుటుంబం ఆయనది అన్న విషయం అందరికీ తెలుసు. చిన్న కుటుంబాల్లోనే మనస్పర్థలు కామన్. అలాంటిది ఇంత పెద్ద ఫ్యామిలీ, పైగా పొలిటికల్ గానూ చాలా యాక్టివ్ గా ఉన్న కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు సాధారణమే. ఇలాంటి రాజకీయ కారణాలతోనే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడిపోయారు చంద్రబాబు నాయుడు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య మాటలు లేవు అని అందరికీ తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. కలిసి ఫోటోస్ కూడా దిగారు. అందుకు కూడా ఎన్టీఆర్ చిన్న కూతురు కారణం కావడం విశేషం.
ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి కూతురు పెళ్లి సందర్భంగా వీరి కుటుంబం అంతా ఒక చోట చేరారు. ఈ ఫంక్షన్ కు బాలకృష్ణ కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అయితే ఇంతకు ముందు కూడా ఈ ఫ్యామిలీలో ఎన్నో ఫంక్షన్స్ జరిగినా.. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలవలేదు. మాట్లాడుకోలేదు. కానీ ఈ సారి మాత్రం వధువుతో కలిసి కుటుంబ సమేతంగా ఫోటోస్ కూడా దిగారు. ఆ తర్వాత చాలా సేపటి వరకూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. నిజంగా ఇది ఎవరూ ఊహించలేదు.
మరోవైపు పురందేశ్వరి బిజెపి రాజకీయాల్లో ఉన్నారు. ఇటు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. చంద్రబాబుతో విభేదాల తర్వాతే వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి దూరంగా వెళ్లారు. మరి ఈ అరుదైన కలయిక తర్వాత మళ్లీ ఆయన కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా లేదా అనేది చూడాలి.

Related Posts