యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ సందర్భం వచ్చినా .. సినిమాలతో పాటు రాజకీయాలు కూడా అనివార్యంగా చర్చలో కనిపిస్తాయి. 2009లో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం ఏకంగా తాత ఎన్టీఆర్ లా రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేశాడు. చివరికి ఓ యాక్సిడెంట్ కూడా అయితే కొద్దిలో తప్పించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీతో అంటకాగలేదు. అయితే ఆ టైమ్ లోనే ఎన్టీఆర్ పెళ్లి గురించి ఆసక్తికరమైన అంశాలు లైన్ లోకి వచ్చాయి. నార్నే శ్రీనివాసరావు కూతురును చంద్రబాబు నాయుడే మాట్లాడి ఎన్టీఆర్ తో పెళ్లి చేశారనేది ఇందులో ప్రధానాంశం. ఇప్పటికీ చాలామంది ఇదే నిజం అని నమ్ముతున్నారు. అయితే లేటెస్ట్ గా తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ సెన్సేషనల్ కమెంట్ చేశాడు.
వంశీ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కొందరు ఎన్టీఆర్ గురించి అడిగారు.
దీంతో వంశీ స్పందిస్తూ.. అతను స్వయంకృషితో ఎదిగాడు. ఎవరూ సాయం చేయలేదు. ఇంకా ఇబ్బందులకు గురి చేశారు. అయినా తట్టుకుని తన ప్రతిభతో నిలిచాడు. తెలుగుదేశం పార్టీ కోసం సేవలు చేస్తే వాడుకుని కరివేపాకులా వదిలేశారు అన్నాడు. ఎవరి సాయం లేకుండానే ఎదిగాడు. చివరికి పెళ్లి విషయంలో కూడా అతనికి ఎవరూ హెల్ప్ చేయలేదు. అవన్నీ చాలా పెద్ద రహస్యాలు. చెబితే చాలామంది నిద్ర కూడా పోరు అంటూ ఇప్పటి వరకూ ఎవరూ ఊహించని కోణంలో కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ పెళ్లి అనగానే చంద్రబాబు సాయం అనే మాట జంట పదంలా కనిపిస్తుంది. దీనికి రివర్స్ గా వంశీ వ్యాఖ్యలు ఉండటంతో దీనికి కౌంటర్ ఏముంటుందా అనే కోణంలో జనం ఆలోచిస్తున్నారు.
దీంతో పాటు.. ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినా ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదు అని అడుగుతున్నారు. అసలు ఎన్టీఆర్ కు ఏం సంబంధం. ఏం జరిగినా ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం పరిపాటయ్యింది అన్నాడు.ఇక ఒకప్పుడు ఎన్టీఆర్, వంశీ, కొడాలి నానితో చాలా స్నేహంగా ఉండేవాడు. ఎన్టీఆర్ ఇంటర్ టైమ్ నుంచీ వీరితో సాన్నిహిత్య ఉంది. ఆ రకంగా వంశీకి ఎన్టీఆర్ అంటే అభిమానం. ఆ కారణంగానే ఇలా స్పందించాడు అనేది చాలామంది వాదన. మరోవైపు వంశీ వైఎస్ఆర్సీపీతో ప్రస్తుతం అంటకాగుతున్నాడు కాబట్టి.. ఎన్టీఆర్ ను వెనకేసుకువస్తున్నాడు అనేది కొందరి వాదన. ఏదేమైనా వంశీ కమెంట్స్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పెళ్లి సంబంధించి. మరి దీనికి టిడిపి లేదా చంద్రబాబు తో పాటు నార్నే ఫ్యామిలీ నుంచి ఏమైనా కౌంటర్స్ వస్తాయా లేదా అనేది చూడాలి.