జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎన్టీఆర్

షూటింగ్ నుంచి బ్రేక్ లభించడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్‘ సమయంలో జపాన్ ప్రేక్షకులతో తారక్ కి మంచి అనుబంధం ఏర్పడింది. ఈనేపథ్యంలోనే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకులను జరుపుకోవడానికి జపాన్ వెళ్లాడు. అక్కడ తారక రామారావుకి అభిమానుల నుంచి అదిరిపోయే వెల్కమ్ లభించింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొట్టాయి.

అయితే.. జపాన్ లో సడెన్ గా వరుస భూకంపాలు సంభవించడం ప్రారంభమయ్యింది. ఆ వార్తలు విన్న ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. జపాన్ లో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు? అనే గందరగోళం నెలకొంది. ఈ విషయాలన్నింటిపైనా ఎన్టీఆరే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.
‘జపాన్ నుంచి ఈరోజు ఇంటికి తిరిగొచ్చాను. తీవ్ర భూప్రకంపాలు సంభవించడం షాక్‌ కు గురిచేసింది. గత వారం అంతా అక్కడే గడిపాను. భూకంప ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దృఢంగా ఉండు జపాన్‘ అంటూ ‘ఎక్స్‘ వేదికగా ట్వీట్ చేశాడు. దాంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.