తెలుగు చిత్రసీమలో ఓ దర్శకుడు ఓ హీరోతో మూడు వరుస విజయాలు చూసి హ్యాట్రిక్ సాధించడం అనేది కొత్తేమి కాదు. అయితే.. ఓ హీరోతో ఓ దర్శకుడు రన్నింగ్ లో కానీ.. వసూళ్లలో కానీ.. వరుసగా మూడు చిత్రాలతో రికార్డులు సృష్టించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి అరుదైన రికార్డులను నటసింహ నందమూరి బాలకృష్ణతో ఇప్పటి వరకు కోడి రామకృష్ణ, బి.గోపాల్ సాధించారు. వారిద్దరి సరసన ఇప్పుడు బోయపాటి కూడా చేరిపోయారు.
ఈ ముగ్గురు దర్శకులు బాలయ్యతో సాధించిన విజయాలు అలాంటివి ఇలాంటివి కాదు. ఈ స్ధాయిలో ఓ హీరోతో మూడు విజయాలు సాధించడం కూడా అరుదైన విషయమే. బాలకృష్ణ కెరీర్ లోనే తొలి బిగ్ హిట్ గా నిలిచిన మంగమ్మ గారి మనవడు వసూళ్ల వర్షం కురిపించడమే కాదు.. రన్నింగ్ లో 565 రోజులు చూసింది. ఇదే బ్యానర్ లో బాలకృష్ణకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ముద్దుల క్రిష్ణయ్య వసూళ్ల వర్షం కురిపించి 365 రోజులు ఆడింది. ఆతర్వాత బాలయ్య, కోడి రామకృష్ణల కాంబోలో వచ్చిన మువ్వగోపాలుడు చిత్రం కూడా మంచి వసూళ్లు చూసింది. ఇలా ఒక హీరోతో మూడు భారీ విజయాలు సాధించడం బాలయ్య, కోడి రామకృష్ణలకు దక్కింది.
ఇక బాలయ్యతో బి.గోపాల్ తెరకెక్కించిన తొలి చిత్రం లారీ డ్రైవర్. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆతర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రౌడీ ఇన్ స్పెక్టర్ కూడా భారీ వసూళ్లు సాధించింది. ఆతర్వాత వీళ్ల కాంబోలో వచ్చిన సమరసింహారెడ్డి అనేక రికార్డులను మట్టికరిపించింది. ఆతర్వాత బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం నరసింహనాయుడు. ఈ సినిమా టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది.
ఇక బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన తొలి చిత్రం సింహ. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ వసూళ్ల వర్షం కురిపించడమే కాదు అత్యధిక రోజులు ప్రదర్శించిన చిత్రంగా కూడా నిలిచింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం అఖండ. రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. దీంతో బాలయ్యకు హ్యాట్రిక్ అందించిన కోడి రామకృష్ణ, బి.గోపాల్ సరసన బోయపాటి చేరారు. మరి.. రానున్న రోజుల్లో బాలయ్య, బోయపాటి కలిసి మరిన్ని సినిమాలు చేసి అద్భుత విజయాలు అందిస్తారని ఆశిద్దాం.