ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల అమ్మకం ఆన్ లైన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. అన్ని సినిమాలకు ఒకటే రేటు అని పెట్టడం.. భారీ చిత్రాలకు దీని వలన భారీగా నష్టం వస్తుందని.. అందుచేత భారీ చిత్రాలకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే.. విశాఖ ఉక్కు కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆన్ లైన్ టికెట్ విధానం చేసి.. తన సినిమాలను ఆపేసి ఆర్థికంగా దెబ్బకొట్టాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. తన సినిమాలను ఆపేస్తే భయపడేంత పిరికివాడిని కాదని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పంతానికి దిగితే తన సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లలో పారదర్శకత లేదన్నారు. ప్రభుత్వం చేసే మద్యం వ్యాపారంలో పారదర్శకత ఉందా? అని పవన్ ప్రశ్నించారు. రూ.700తో మద్యం తాగి రూ.5తో సినిమా టిక్కెట్ కొనుక్కొని వెళితే ప్రభుత్వానికి సంతోషంగా ఉంటుందా? అని పవన్ ఎద్దేవా చేశారు. అందరూ కలిసి వైసీపీ నేతలను చొక్కా పట్టుకొని నిలదీయకపోతే వాళ్లు మాట వినరు. జనసేకు మద్దతిస్తే నేను చేసి చూపిస్తానని పవన్ అన్నారు. 2024 ఎన్నికల వరకూ వైసీపీ గుండాయిజం బూతులు భరించాల్సిందే. ఆలోచించి ఓటు వేయకపోతే విలువ తెలియకుండా అమ్ముకుంటే ప్రజల స్వయంకృతాపరాధమే అని పవన్ అన్నారు.