నాయకుడు దర్శకుడి చేతిలో స్టార్ హీరో కొడుకు

హిట్ డైరెక్టర్ అనే పేరొస్తే చాలు.. స్టార్ హీరోలే క్యూ కడుతుంటారు. కానీ ఆ దర్శకులకు ఖచ్చితమైన శైలి ఉంటే అందరు హీరోలూ వారితోచేయలేరు. అలాంటి దర్శకులు తమిళ్ లో చాలామంది ఉన్నారు. ఇలాంటి దర్శకులతో పనిచేయాలని హీరోలు అనుకుంటారు. కానీ వారి కథలకు అందరు హీరోలూ సెట్ కారు. అలాంటి ఓ సెటప్ ను ఈ మధ్య కాలంలో సెట్ చేసిన దర్శకుల్లో పా రంజిత్ ఒకడు.

అతని కథల్లో తన నేపథ్యం కనిపిస్తుంది. అతని వారసత్వంలోనే వచ్చిన మరో దర్శకుడు మారి సెల్వరాజ్. తమిళ్ లో హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్నాడిప్పుడు. ఫస్ట్ మూవీ పరియేరుమ్ పెరుమాళ్ తర్వాత ధనుష్ నే మెప్పించాడు. అతనితో చేసిన కర్ణన్ ఏకంగా వంద కోట్లు సాధించింది. ఇక రీసెంట్ గా మామన్నన్ అనే చిత్రంతో వచ్చాడు. కమెడియన్ గా ఐదు దశాబ్దాల పాటు మెప్పించిన వడివేలును ఇందులో సీరియస్ పొలిటీషియన్ గా చూపించి ఆశ్చర్యపరిచాడు.

ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్‌, ఉదయనిధి స్టాలిన్ నటించిన మామన్నన్ కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. తెలుగులోనూ ఈ మూవీ నాయకుడు అనే పేరుతో డబ్ అయింది. బట్ ఇక్కడివాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఆ ప్లాట్ ఫామ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అదీ మారి సెల్వరాజ్ ప్రతిభ. ఎంత తన నేపథ్యపు కథలు చెప్పినా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోతే నిర్మాతలు పట్టించుకోరు. బట్ పా రంజిత్, మారి సెల్వరాజ్ కమర్షియల్ హిట్స్ కొడుతున్నారు. అందుకే వరుసగా సినిమాలు వస్తున్నాయి.


ఓ వైపు మామన్నన్ విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకుని బిజీ అయ్యాడు మారి సెల్వరాజ్.నేషనల్ అవార్డ్ విన్నర్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో సెల్వరాజ్ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ధృవ్ ఇంతకు ముందు తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. తర్వాత తండ్రితో కలిసి మహాన్ అనే సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలతో అతని ముద్రంటూ ఏం కనిపించలేదు. అందుకే తనయుడిని మారి సెల్వరాజ్ వంటి వారి చేతిలో పెడితే వర్కవుట్ అవుతుందనుకున్న విక్రమ్ తన కొడుకును సెల్వరాజ్ డైరెక్షన్ లో నటింప చేస్తున్నాడు.

ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని పా రంజిత్ నిర్మించబోతున్నాడు. అలాగే విక్రమ్ ఇప్పుడు పా రంజిత్ డైరెక్షన్ లో తంగలాన్ అనే సినిమా చేస్తున్నాడు. సో.. ఈ టైమ్ లోనే వీరి మధ్య విక్రమ్ కొడుకు గురించి డిస్కషన్ వచ్చి ఉంటుంది. అతన్ని ఎలాంటి కథలో చూపించాలో రంజిత్ చెప్పి ఉంటాడు. అందుకు ఒప్పుకున్న విక్రమ్ తన కొడుకును పా రంజిత్ నిర్మిస్తోన్న మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేయబోతోన్న సినిమా కోసం ఇచ్చాడు. సో ఈ మూవీతో ధృవ్ తనను తాను నిరూపించుకుంటాడేమో చూడాలి.

Related Posts