సరైన టైములో వస్తోన్న విశాల్ ‘రత్నం’

సినిమాల విడుదలకు సరైన సీజన్ అంటే సమ్మర్. ఈ వేసవి బరిలో ఎలాంటి పోటీ లేకుండా రేపు (ఏప్రిల్ 26) థియేటర్లలోకి వస్తోంది విశాల్ నటించిన ‘రత్నం’. అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది. అందుకు ప్రత్యేక కారణం.. విశాల్ తో గతంలో ‘భరణి, పూజ’ వంటి రెండు సూపర్ హిట్స్ అందించిన హరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం మరో అదనపు ఆకర్షణ అయ్యే అవకాశాలున్నాయి.

విశాల్ కి జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించిన ఈ సినిమాలో సముద్రఖని, మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, యోగిబాబు వంటి వారు ఇతర ప్రధాన పాతరలు పోషించారు. ‘రత్నం’ చిత్రానికి హిట్ టాక్ వచ్చిందంటే రెండు, మూడు వారాల పాటు బాక్సాఫీస్ ను కుమ్మేయొచ్చు. ఇక.. యాక్షన్ స్టార్ విశాల్ కి తెలుగులో చాన్నాళ్లుగా హిట్ లేదు. విశాల్ గత చిత్రం ‘మార్క్ ఆంటోని’ తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేకపోయింది. తమిళంలో మాత్రం ‘మార్క్ ఆంటోని’ వంద కోట్లు వసూళ్లు సాధించింది. మరి.. ‘రత్నం’ విశాల్ కి ఎలాంటి విజయాన్నందిస్తుందో చూడాలి.