ఒకే ఫ్రేములో ఇద్దరు సూపర్ స్టార్స్

భారతీయ చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా చెక్కుచెదరని స్టార్ డమ్ సొంతం చేసుకుంటూ సాగుతోన్న కథానాయకులను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచే నటులు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.

వీరిద్దరూ ఎవరికి వారు సోలో హీరోస్ గా దుమ్మురేపుతోన్న సమయంలోనే.. కలిసి కూడా ‘అంధాకానూన్, గిరఫ్తార్, హమ్‘ వంటి చిత్రాల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ పై ఈ ఇద్దరి సూపర్ స్టార్స్ ని కలిసి చూసే అవకాశం ఇప్పుడు మరోసారి రాబోతుంది.

‘జైలర్’ బ్లాక్ బస్టర్ తో మంచి జోష్ మీదున్న రజనీకాంత్.. ఇటవలే తన 170వ సినిమాకి శ్రీకారం చుట్టాడు. ‘జై భీమ్’తో యావత్ దేశాన్ని కదిలించిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ముంబైలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకోబోతుంది. ఈ షెడ్యూల్ కోసం రజనీకాంత్ ముంబై పయనమయ్యాడట. అక్కడ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ వంటి భారీ కాస్టింగ్ నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.