ఫిబ్రవరికి వెళ్లిన ‘టిల్లు స్క్వేర్‘

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజె టిల్లు‘ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. యూత్ ఫుల్ కంటెంట్ తో బాగా అలరించిన ‘డీజె టిల్లు‘ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోన్న సినిమాయే ‘టిల్లు స్క్వేర్‘. అసలు ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లోనే రావాల్సి ఉంది. అయితే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే విడుదలను ఆపారట. లేటెస్ట్ గా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 9న ‘టిల్లు స్క్వేర్‘ రిలీజ్ కు రెడీ అవుతోంది.

వచ్చే ఫిబ్రవరిలో ప్రేమికులరోజు టార్గెట్ గా ‘టిల్లు స్క్వేర్‘ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల సంయుక్తంగా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను రిలీజ్ చేస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో ‘టిల్లు స్క్వేర్‘ రూపొందుతోంది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్స్ సహ నిర్మాణ సంస్థలుగా ఉన్నాయి.

‘డీజె టిల్లు‘లో హీరోకి దీటైన పాత్రలో హీరోయిన్ గా నేహాశెట్టి కనిపించింది. ఇప్పుడు సీక్వెల్ లోనూ హీరోయిన్ రోల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.