‘ఓదెల 2’ కోసం యాక్షన్ మోడ్ లో తమన్నా

ఓటీటీలో మంచి విజయాన్ని సాధించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోంది ‘ఓదెల 2’. డైరెక్టర్ సంపత్ నంది నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి భాగంలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తే.. సీక్వెల్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తుంది. గతంలో ‘రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్’ వంటి చిత్రాల్లో తమన్నా లోని గ్లామర్ యాంగిల్ ను ఆవిష్కరించాడు సంపత్ నంది. అయితే.. ఈ సినిమాలో తమన్నా శివశక్తిగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతుంది.

ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘ఓదెల 2’.. తాజాగా హైదరాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టుకుంది. ఈ షెడ్యూల్ లో టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారట. ఈ సీక్వెన్స్ లో తమన్నా చేసే స్టంట్స్ అదిరిపోతాయని చెబుతోంది చిత్రబృందం.

అందుకోసం.. మిల్కీ బ్యూటీ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుందట. టాప్ టెక్నీషియన్స్ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్, నీతా లుల్లా కాస్ట్యూమ్స్ ‘ఓదెల 2’కి మంచి ప్లస్ అవుతాయని భావిస్తోంది టీమ్.

Related Posts