మెగా ఆఫర్ అందుకున్న సాయిపల్లవి?

వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ‘విరాటపర్వం‘ తర్వాత అసలు సినిమాలు చేస్తోందా? లేదా? అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే.. అలాంటి అపొహలన్నీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు కొత్త సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే నాగచైతన్య 23వ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన సాయిపల్లవి.. శివకార్తికేయన్ 21వ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తుంది.

ఈ సినిమాలతో పాటు.. లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా నటించే ఛాన్స్ అందుకుందట సాయిపల్లవి. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‘తో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.


మైత్రీ మూవీమేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడనే ప్రచారం ఉంది. లేటెస్ట్ గా ఈ మూవీలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంమీద.. త్వరలోనే పట్టాలెక్కే రామ్ చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్టులో సాయిపల్లవి ఎంట్రీపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.