తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తమ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్లు సబ్ మిట్ చేస్తున్నారు. అలా.. గుంటూరు ఎమ్.పి. స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.
గుంటూరు ఎమ్.పి. గా ఉన్న గల్లా జయదేవ్ కూడా దేశంలోనే అత్యంత ధనవంతులలో ఒకరుగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ, వ్యాపార వేత్త గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించి పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో చంద్రశేఖర్ను గుంటూరు నుంచి పోటీకి దింపాలని టీడీపీ నిర్ణయించింది.
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 22న పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆస్తిపాస్తుల అఫిడవిట్ కూడా సమర్పించారు. భారీగా వ్యవసాయ భూములు, నివాస భవనాలు, వాణిజ్య సముదాయాలు చంద్రశేఖర్తోపాటు ఆయన సతీమణి శ్రీరత్న పేరిట ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాతోపాటు హైదరాబాద్, ఢిల్లీ, అమెరికాలో ఆ దంపతులకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తల పేరిట ఉన్న స్థిరాస్తులు విలువనే రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటాయి. వీరి ఆస్తిపాస్తుల చిటటా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తన అఫిడవిట్లో కుటుంబ ఆస్తులు రూ. 5,705 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు. అతని అఫిడవిట్ ప్రకారం, ఆధారపడిన కుమారుడు, అభినవ్ పెమ్మసాని రూ. 496.27 కోట్ల చరాస్తులను కలిగి ఉండగా, ఆధారపడిన కుమార్తె సహస్ర పెమ్మసాని రూ. 496.47 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు. కుటుంబానికి ఆఫ్షోర్లో రూ.16.51 కోట్ల ఆస్తులు ఉన్నాయి.