రానా తగ్గనంటున్నాడు.. గుణశేఖర్ ఏం చేస్తాడు

గుణశేఖర్.. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తన కథలకంటే సెట్స్ కే ఎక్కువ ఖర్చు పెడతాడు అనే పేరు కూడా ఉంది. తన కెరీర్ లో కొన్ని మెమరబుల్ హిట్స్ ఉన్నాయి. మైల్ స్టోన్ లాంటి విజయాలూ ఉన్నాయి. అయితే అదంతా గతం.

కొన్నాళ్లుగా గుణశేఖర్ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్దవర్కవుట్ కావడం లేదు. రుద్రమదేవి తర్వాత చేసిన శాకుంతలం సినిమా దారుణంగా పోయింది. కంటెంట్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ సైతం నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాకంటే ముందే అతను రానాతో హిరణ్యకశిప సినిమా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు.

అతనికి తన వెర్షన్ లో కథ కూడా చెప్పాడు. అప్పుడు రానా కూడా సుముఖంగానే ఉన్నాడు. బట్ శాకుంతలం చూసిన తర్వాత మనసు మార్చుకున్నాడు. అందుకే మరో దర్శకుడితో ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయం ఆల్రెడీ అనౌన్స్ అయింది.

పైగా ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచన చేస్తున్నాడు. అమర్ చిత్ర కథల నుంచి ఇన్ స్పైర్ అయ్యి ఈ కథను రాస్తున్నాడు త్రివిక్రమ్. ఈ విషయం తెలిసిన గుణశేఖర్ ఆ మధ్య తిట్లు, శాపనార్థాల్లాంటివి పెట్టాడు. పైన దేవుడున్నాడు. అతనే చూసుకుంటాడు అన్నాడు. అయితే ఆ టైమ్ లో రానా అమెరికాలో ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏమైనా రాజీ పడతారేమో అనుకున్నారు. బట్ రానా అలాంటివేం చేయడం లేదు.

గుణశేఖర్ ను అస్సలు పట్టించుకోకుండా తను మాత్రం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశాడు. త్వరలోనే ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేయబోతున్నారు. హిరణ్యకశిప అనేది మన పురాణాల నుంచి తీసుకుంటోన్న కథ.