‘ఈగల్’ సెన్సార్ కంప్లీట్.. అయినా పునరాలోచనలో టీమ్?

సంక్రాంతి బరిలో సందడి చేయబోతున్న చిత్రాలలో మాస్ మహారాజ రవితేజ ‘ఈగల్’ ఒకటి. సినిమాటోగ్రాఫర్ కమ్ ఎడిటర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమాలో రవితేజాకి జోడీగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ విడుదలయ్యాయి. లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసుకుంది. ‘ఈగల్’ చిత్రానికి జీరో కట్స్ తో ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.

అంతా బాగానే ఉంది. కానీ సంక్రాంతి సందడిలో తమ సినిమాని విడుదల చేయాలా? వద్దా? అనే సందిగ్దంలో ఉందట నిర్మాణ సంస్థ. ఈసారి సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండడంతో థియేటర్ల సమస్య భారీగా ఉంది. పైగా.. ‘గుంటూరు కారం’ హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది. వెంకటేష్, నాగార్జున సినిమాలపైనా మంచి అంచనాలున్నాయి. ఎందుకంటే.. ఈ సీనియర్ హీరోలిద్దరి సినిమాలొచ్చి సంవత్సరం దాటిపోయింది. ‘హానుమాన్’ విషయానికొస్తే.. ఈ సినిమా తెలుగు మార్కెట్ కంటే పాన్ ఇండియాను ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. ‘ఈగల్’ చిత్రాన్ని సంక్రాంతి నుంచి రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తే బాగుంటుందనేది నిర్మాతల ఆలోచనట. రిపబ్లిక్ డే రోజునే మాస్ మహారాజ రవితేజ పుట్టినరోజు కూడా.