రాజమౌళి-మహేష్ మూవీపై క్రేజీ అప్డేట్..!

దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసేందుకు టాలీవుడ్ టు బాలీవుడ్ నిర్మాతలంతా క్యూ కడతారు. కానీ.. జక్కన్న మాత్రం ఎప్పుడో ఇచ్చిన కమిట్ మెంట్ కే కట్టుబడి ఉంటాడు. ఈకోవలో ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేతలు కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి లతో సినిమా చేస్తున్నాడు.

రాశిలో తక్కువైనా వాసిలో ఎంతో విలక్షణమైన సినిమాలు నిర్మించింది శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ. గతంలో శ్రీ దుర్గా ఆర్ట్స్ నుంచి ‘క్షణ క్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ’ వంటి చిత్రాలొచ్చాయి. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు రాజమౌళి-మహేష్ బాబు మూవీని నిర్మిస్తోంది ఈ సంస్థ.

లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో మహేష్ ‘ఎస్.ఎస్.ఎమ్.బి. 29′ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు నిర్మాతల్లో ఒకరైన ఎస్.గోపాల్ రెడ్డి. ‘ప్రస్తుతం రాజమౌళి-మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని.. ఈ సినిమా గురించి రాజమౌళికి తప్ప మరెవరికీ ఏ అప్‌డేట్‌ తెలియదని.. ఈ కథ మొత్తం తాను విన్నానని.. అద్భుతంగా ఉందన్నారు. అలాగే.. ఈ మూవీ షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? అనే అప్‌డేట్స్‌ అన్నీ రాజమౌళికే తెలుసునని’ గోపాల్ రెడ్డి తెలిపారు. ఇక.. ఈ సినిమా కథ ‘ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగనుందని.. ఇది ఎంతో సాహసోపేతమైన కథ’ అని కూడా చెప్పారు గోపాల్ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయి.