బాలయ్య కొడుకు వస్తున్నాడు

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..? దాదాపు పదేళ్లుగా వినిపిస్తోందీ మాట. ఇప్పటికే మోక్షజ్ఞ వయసుకు 28యేళ్లు. మరి ఇంకా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ తో పాటు నందమూరి అభిమానులు కూడా అనుకుంటున్నారు.

అయితే బాలయ్య తన కొడుకును ఒకప్పటి తన బ్లాక్ బస్టర్ మూవీ ఆదిత్య 369 రీమేక్ తోనే పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఈ మేరకు ఆ మధ్య ఆ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కూడా కొన్ని చర్చలు నడిచాయి. అయితే ఈ మేటర్ తర్వాత తర్వాత మెల్లగా డైల్యూట్ అయిపోయింది. మరోవైపు మోక్షజ్ఞ కాస్త లావుగా మారడంతో పాటు హీరోగా ఎంట్రీ ఇచ్చేంత ఫిట్ నెస్ తో కనిపించడం లేదు.

దీంతో చాలామంది ఈ విషయం మర్చిపోతున్నారు. ఈ టైమ్ లో సడెన్ గా మళ్లీ బాలయ్య తనయుడి ఎంట్రీ గురించి అప్డేట్స్ ఇచ్చాడు. రీసెంట్ గా బాలయ్య అమెరికా వెళ్లాడు. అక్కడ తానా సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అక్కడే తన అభిమానులు, సన్నిహితులతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడట.

ఆదిత్య 369 ను ఆదిత్య 999 టైటిల్ తో సినిమా చేస్తామని గతంలోనే చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం. అంతే కాదు.. ఈ కాలం ఆడియన్స్ తో పాటు టెక్నాలజీకి తగ్గట్టుగా ఈ స్టోరీ స్పాన్ ను కూడా పెంచబోతున్నారట.

అంటే టైమ్ ట్రావెల్ అంటే ఇప్పుడు చాలా కామన్ అయింది. అందుకే ఆ పాయింట్ తోనే ప్రేక్షకులు ఊహించలేని ఓ కొత్త కథను చెప్పే ప్రయత్నంలో ఉన్నామని చెప్పాడట. సో.. మోక్షజ్ఞ ఎంట్రీ టైమ్ ట్రావెల్ తోనే ఉంటుందని మరోసారి స్పష్టమైంది. కాకపోతే ఎప్పుడు అనే ప్రశ్నకే సరైన ఆన్సర్ రావడం లేదు. ఇదే నందమూరి అభిమానుల్లో కాస్త నిరాశను కలిగిస్తోంది.