మర్డర్ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్

కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. ఈరోజు ఉదయం మైసూరులోని ఓ ఫామ్ హౌజ్ లో దర్శన్ సహా పది మందిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు విషయమేమిటంటే.. జూన్ 9న కర్ణాటకలోని సుమన్నహళ్లి బ్రిడ్జి సమీపంలో రేణుక స్వామి మృతదేహం దొరికింది. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిది హత్యగా అనుమానించారు పోలీసులు. విచారణలో భాగంగా ఈ హత్యలో హీరో దర్శన్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

కన్నడ నటి పవిత్ర గౌడతో దర్శన్‌కు రిలేషన్ ఉన్నట్లు గతంలో రూమర్స్​ వచ్చాయి. దర్శన్ తో తనకు సంబంధం ఉన్నట్లు ఆమె వివాదాస్పద పోస్ట్ కూడా చేసింది. దీంతో పవిత్ర గౌడ – దర్శన్ భార్య విజయ లక్ష్మి మధ్య వివాదం నడిచింది. అనంతరం నటి పవిత్ర గౌడపై రేణుకా స్వామి కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కించపరిచే పోస్ట్‌లు చేశాడు. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు తెలిసింది. దర్శన్ సూచన మేరకే అతన్ని హత్య చేసినట్లు నలుగురు నిందితులు అంగీకరించినట్లు పోలీసుల విచారణలో తేలిందట. ప్రస్తుతం దర్శన్ అరెస్ట్ విషయం కర్ణాటకలో సంచలనంగా మారింది.

Related Posts