విజయేంద్రప్రసాద్ కిట్టీలో రెండు బ్లాక్ బస్టర్ స్టోరీస్..!

ఎనిమిది పదుల వయసు దాటినా.. తనలోని క్రియేటివిటీకి ఎప్పటికప్పుడు పదును పెడుతూ స్టార్ రైటర్ గా అగ్రపథాన దూసుకెళ్తుంటారు విజయేంద్రప్రసాద్. ఈ లెజెండరీ రైటర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు దాటినా.. అగ్ర రచయితగా గుర్తింపు రావడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. తన తనయుడు రాజమౌళి దర్శకధీరుడు గా అవతరించడంలో విజయేంద్రప్రసాద్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి తొలి చిత్రం నుంచి మొన్నటి ‘ఆర్.ఆర్.ఆర్‘ వరకూ దాదాపుగా విజయేంద్రప్రసాదే కథలు సమకూర్చారు. కేవలం తనయుడి సినిమాల కోసమే కాదు.. బయట ప్రొడక్షన్స్ కోసమూ విజయేంద్రప్రసాద్ బ్లాక్ బస్టర్ స్టోరీస్ అందించారు.

ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ నుంచి రెండు సూపర్ హిట్ మూవీస్ కి సీక్వెల్ స్టోరీస్ రెడీగా ఉన్నాయట. వాటిలో ఒకటి ‘విక్రమార్కుడు 2‘ అయితే.. మరొకటి ‘భజరంగీ భాయిజాన్ 2‘. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు‘ ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఆ తర్వాత హిందీతో పాటు పలు భాషల్లో రీమేకై అక్కడా అదిరిపోయే సూపర్ హిట్స్ సాధించింది. అలాంటి ‘విక్రమార్కుడు‘కి సీక్వెల్ గా ‘విక్రమార్కుడు 2‘ స్టోరీ రెడీ చేశారట విజయేంద్రప్రసాద్. ‘విక్రమార్కుడు 2‘ని తాను నిర్మించబోతున్నట్టు ఇటీవల నిర్మాత కె.కె.రాధామోహన్ తెలిపారు. అయితే.. ‘విక్రమార్కుడు‘ సీక్వెల్ కి సంబంధించి దర్శకుడు, హీరో ఎవరనే దానిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది.

మరోవైపు.. విజయేంద్రప్రసాద్ కథతో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘భజరంగి భాయిజాన్‘ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి కూడా సీక్వెల్ స్టోరీ రెడీ చేశారట విజయేంద్రప్రసాద్. ఇటీవల సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ హీరోగా నటించిన ‘రుస్లాన్‘ సినిమా వేడుకలో నిర్మాత రాధామోహన్ ‘భజరంగి భాయిజాన్ 2‘ గురించి కూడా హింట్ అందించారు.