పవర్స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. అయితే.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం ఉదయం వికారాబాద్లోని మదన్పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమైంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, పవన్ అభిమానులు పవన్ను చూసేందుకు భారీగా లొకేషన్ వద్దకు చేరుకున్నారు. పవన్కళ్యాణ్.. పవన్కళ్యాణ్.. అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన కారు నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అక్కడకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో చిత్రీకరణ జరిగే ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ సినిమాలో పవన్కు జంటగా నిత్యామేనన్, రానా దగ్గుబాటికి జంటగా సంయుక్త మేనన్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన భీమ్లా నాయక్ టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ భారీ మల్టీస్టారర్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.