బాలకృష్ణకి జోడీగా ముగ్గురు భామలు

మాస్ హీరో అంటేనే అభిమానులను అలరించేలా డైలాగులు చెప్పాలి.. కుర్రకారును ఉర్రూతలూగించేలా డ్యాన్సులు వేయాలి.. ఫైట్స్ చేయాలి. అలాంటి క్వాలిటీస్ అన్నీ పుష్కలంగా ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. అందుకే.. టాలీవుడ్ లో నటసింహం ను అసలుసిసలు మాస్ హీరో అంటుంటారు. ఇక.. బాలయ్య మాస్ ఇమేజ్ ను మరింత పీక్స్ లో చూపించబోతున్నాడట డైరెక్టర్ బాబీ. ఎన్.బి.కె.109 కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా బాలకృష్ణ సరసన ముగ్గురు భామలు నటించబోతున్నారట.

చిరంజీవితో బాబీ తీసిన ‘వాల్తేరు వీరయ్య‘లో బాస్ పార్టీ సాంగ్ లో అదరగొట్టింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఇప్పుడా ముద్దుగుమ్మ ఎన్.బి.కె.109 లోనూ నటిస్తుందట. ఈ సినిమాలో బాలయ్యతో చిందులు వేయడమే కాకుండా.. కొన్ని కీలక సన్నివేశాల్లోనూ సందడి చేయనుందట. టాలీవుడ్ లో ప్రెజెంట్ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మరో నాయికగా నటించనుందట. వీరిద్దరితో పాటు ఓ సీనియర్ హీరోయిన్ కి కూడా ఈ చిత్రంలో చోటున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రలో త్రిష కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తంమీద.. తన 109వ సినిమాకోసం ముచ్చటగా ముగ్గురు భామలతో చిందులేయనున్నాడట నటసింహం బాలకృష్ణ.