‘విశ్వంభర‘ టీమ్ ను సర్ప్రైజ్ చేసిన అజిత్

తమిళ అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్ సినిమాల్లోకి వెళ్లకముందు కొన్నిరోజులు హైదరాబాద్ లోనే గడిపాడు. అలాగే.. అజిత్ తన తొలి చిత్రాన్ని తెలుగులోనే చేశాడు. గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మొదలైన కొన్ని రోజులకే గొల్లపూడి శ్రీనివాస్ ప్రమాదంలో మరణించడంతో.. గొల్లపూడి మారుతీరావే ‘ప్రేమపుస్తకం‘ను పూర్తిచేశారు. 1993లో ‘ప్రేమపుస్తకం‘ విడుదలైంది. ఇక.. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ‘ప్రేమపుస్తకం‘ సినిమాని చూసి.. ఆ చిత్రానికి, ఆ జంటకి విజయోస్తు పలికారు అనే పోస్టర్ ఒకటి ఈ సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతీసారి కనిపిస్తూ ఉంటుంది.

కట్ చేస్తే.. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘ సెట్స్ లోకి అనుకోని అతిథిలా ప్రత్యక్షమయ్యాడట అజిత్ కుమార్. ‘విశ్వంభర‘ సెట్స్ లో చిరంజీవి, అజిత్ కలుసుకున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విషయమేమిటంటే.. అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

Related Posts