తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం రామోజీరావు

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే అత్యున్నత పరిశ్రమగా రాజ్యమేలుతోంది. టాలీవుడ్ గ్రేటెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారడం వెనుక.. హైదరాబాద్ సినీ పరిశ్రమకు కేంద్రంగా భావించడం వెనుక రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కారణం. టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని పరిశ్రమలకు సంబంధించిన చిత్రాలు రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటాయి. స్క్రిప్ట్ తో వెళ్లిన వారు.. ఫైనల్ అవుట్ పుట్ తో బయటకు వచ్చేలా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రతీ అంశం రామోజీ ఫిల్మ్ సిటీలో అందుబాటులో ఉంటుంది.

దేశం గర్వించదగ్గ ఫిల్మ్ సిటీని నిర్మించడం కంటే ముందే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అత్యద్భుత చిత్రాలు నిర్మించిన ఘనత రామోజీరావు సొంతం. చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధించారు రామోజీరావు. తొలుత సందేశాత్మక, వాస్తవ జీవిత సంఘటలకు సంబంధించిన కథలతో సినిమాలు చేసి విజయాలు సాధించారు. సుధా చంద్రన్ జీవిత కథతో ఆమే కథానాయికగా రూపొందిన ‘మయూరి’, అశ్వని నాచప్ప కథాంశంతో ఆమే కథానాయికగా వచ్చిన ‘అశ్వని’ సినిమాలు వాస్తవ కథాంశాలకు ప్రతిరూపంగా ఉషాకిరణ్ మూవీస్ నుంచి విజయాలు సాధించాయి.

ఇక.. ‘ప్రతిఘటన, మౌనపోరాటం, పీపుల్స్ ఎన్‌కౌంటర్’ వంటి సినిమాలు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ప్రతిరూపాలు. అలాగే.. ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు సినిమాలు నిర్మించ‌డంలో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి. 2000 సమయంలో చిన్న బడ్జెట్ లో భారీ విజయాలు సాధించిన చిత్రాలను అందించారు రామోజీరావు. ఆ చిత్రాలే ‘చిత్రం, నువ్వేకావాలి, ఆనందం’. ఈ మూడు సినిమాలూ ఉషాకిరణ్ మూవీస్ కి కాసులు కురిపించాయి. ఈ సినిమాల ద్వారా పరిచయమైన ఉదయ్ కిరణ్, తరుణ్ కొన్నాళ్లుగా కథానాయకులుగా దుమ్మురేపారు. ఈ సినిమాలు తేజ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్.పి.పట్నాయక్ వంటి టెక్నీషియన్స్ స్థానాన్ని చిత్ర పరిశ్రమలో సుస్థిరం చేశాయి.

ఈ సంస్థ చివరిగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘దాగుడు మూతలు దండాకోర్’ సినిమా చేసింది. ఆ తర్వాత చిత్ర నిర్మాణాన్ని తగ్గించింది. ఉషాకిరణ్ మూవీస్ నుంచి అన్ని భాషల్లోనూ దాదాపు 85 సినిమాల వరకూ వచ్చాయి. వంద సినిమాలు నిర్మించాలనేది రామోజీరావు కోరిక. అయితే.. అనుకున్న స్థాయి కథలు రాకపోవడంతో ఉషాకిరణ్ మూవీస్ సినీ నిర్మాణం తగ్గిస్తూ వచ్చింది.

Related Posts