విజయ్ సేతుపతికి జోడీగా నిత్యా మీనన్

ఇటీవలే తన ప్రతిష్ఠాత్మక 50వ సినిమా ‘మహారాజ‘తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ సేతుపతి. ‘మహారాజ‘ తర్వాత విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్, విడుదలై పార్ట్ 2‘ సినిమాలను విడుదలకు ముస్తాబు చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు.. లేటెస్ట్ గా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సేతుపతి. తమిళ విలక్షణ దర్శకుడు పాండిరాజ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడట.

తమిళంలో పల్లెటూరి కథాంశాలకు పెట్టింది పేరు పాండిరాజ్. శివకార్తికేయన్ తో ‘నమ్మ వీట్టు పిళ్లై‘, సూర్యతో ‘ఈటీ‘ వంటి విజయాలందించిన పాండిరాజ్.. విజయ్ సేతుపతి కోసం ఆద్యంతం రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ సిద్ధం చేశాడట. ఈ మూవీలో విజయ్ సేతుపతికి జోడీగా నిత్యా మీనన్ ఎంపికైనట్టు ప్రచారం జరుగుతుంది. సహజ నటులుగా పేరొందిన విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుంది. త్వరలోనే.. ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్టు కోలీవుడ్ టాక్.

Related Posts