తమిళంలో తగ్గేదే లే అంటోన్న బేబమ్మ

ఫస్ట్ మూవీతోనే క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ అరుదుగా ఉంటారు. అలాంటి హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరు. తొలి సినిమా ‘ఉప్పెన’తో వంద కోట్ల క్లబ్ లో చేరి.. ఏకంగా అరడజనుకు పైగా ఆఫర్లు దక్కించుకుంది. దాంతో.. టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందనుకున్నారంతా. కానీ ఆ అరడజను సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు ఫరవాలేదనిపిస్తే.. మిగతావి ఫెయిల్ అయ్యాయి. ఇక.. బేబమ్మ పనైపోయిందనే రూమర్స్ వినిపించాయి. అయితే.. తెలుగులో సినిమాలు లేకపోయినా.. తమిళం, మలయాళంలో మాత్రం దుమ్మురేపుతోంది ఈ కన్నడ కస్తూరి.

క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలను విడుదలకు ముస్తాబు చేస్తుంది. వాటిలో శర్వానంద్ తో నటించిన ‘మనమే’ ఒకటి.

జూన్ 7న ఈ సినిమా విడుదలకాబోతుంది. ఇక.. తమిళంలో కృతి శెట్టి నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాది విడుదలకాబోతున్నాయి. వీటిలో ముందుగా వచ్చేది జయం రవితో కలిసి నటించిన ‘జెనీ’. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఆ తర్వాత ‘లవ్ టుడే’ ఫేమ్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో ‘ఎల్.ఐ.సి’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

ఇక.. ఈ ఏడాది దివాళి కానుకగా కార్తీ-కృతి శెట్టి నటిస్తున్న ‘వా వాతియార్’ విడుదలకు ముస్తాబవుతోంది. మరోవైపు మలయాళంలో టోవినో థామస్ తో ‘ఎ.ఆర్.ఎమ్’ అనే పాన్ ఇండియా మూవీలోనూ నటిస్తుంది కృతి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఓనమ్ స్పెషల్ గా ‘ఎ.ఆర్.ఎమ్.’ రిలీజ్ కు రెడీ అవుతోంది. మొత్తంమీద.. తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా.. తమిళంలో మాత్రం తగ్గేదే లే అంటోంది బేబమ్మ.

Related Posts