ఇక నుంచి ఛార్మింగ్ స్టార్ శర్వానంద్

తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాల నట ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న యువ కథానాయకుల్లో శర్వానంద్ ఒకడు. తొలి నుంచీ పక్కింటబ్బాయి తరహా పాత్రల్లో అలరిస్తూ వస్తున్నాడు శర్వానంద్. ‘ఒకే ఒక జీవితం’ వంటి విజయం తర్వాత దాదాపు రెండేళ్లకు శర్వా నుంచి వస్తోన్న మూవీ ‘మనమే’. ఆద్యంతం యూరప్ బ్యాక్‌డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రాబోతుంది. శర్వానంద్ కెరీర్ లో 35వ సినిమా అయిన ‘మనమే’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. జూన్ 7న విడుదలకు ముస్తాబైన ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేటెస్ట్ గా జరిగింది.

ఈ ఈవెంట్ లో నిర్మాత టి.జి.విశ్వప్రసాద్.. శర్వానంద్ కి ఛార్మింగ్ స్టార్ అనే బిరుదిచ్చారు. ‘మనమే’ మూవీ నుంచి శర్వా పేరు ముందు ఛార్మింగ్ స్టార్ పడనుందట. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శర్వాకి జోడీగా కృతి శెట్టి నటించింది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్నందించిన ‘మనమే’ పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక.. లేటెస్ట్ గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పిఠాపురం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శర్వానంద్. అసలు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలోనే నిర్వహించాలనుకున్నట్టు చెప్పాడు. అయితే.. పర్మిషన్ రాని కారణంగా కుదరలేదన్నాడు. సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ మీట్ ను పిఠాపురంలో నిర్వహిస్తామని తెలిపాడు శర్వానంద్.

Related Posts