దశాబ్దాలుగా చెక్కు చెదరని స్నేహం

దశాబ్దాలుగా చెక్కు చెదరని స్టార్ డమ్ సంపాదించుకున్న కథానాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందన వారే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ లెజెండరీ యాక్టర్స్ ఇద్దరూ ఒకే ఏడాది సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు.. 1975లో విడుదలైన ‘స్వర్గం నరకం’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘స్వర్గం నరకం’ మంచి విజయాన్ని సాధించింది. అప్పటినుంచి ఇప్పటికీ తన విలక్షణమైన నటనతో అలరిస్తూనే ఉన్నారు మోహన్ బాబు.

1975లోనే కె.బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగల్’తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు రజనీకాంత్. ఆ తర్వాతి సంవత్సరం రజనీకాంత్ నటించిన తొలి తెలుగు చిత్రం ‘అంతులేని కథ’ విడుదలైంది. ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి రావడంతో రజనీకాంత్, మోహన్ బాబు మంచి మిత్రులయ్యారు. ఆ స్నేహంతోనే ఆ తర్వాత మోహన్ బాబు తీసిన ‘పెదరాయుడు’లో అతిథి పాత్రలో అదరగొట్టాడు తమిళ సూపర్ స్టార్.

చాలా కాలం తర్వాత మిత్రులు రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో సందడి చేశారు. ప్రైవేట్ ఫ్లైట్ లో ఎక్కడితో వెళుతూ పక్కపక్కన సీట్లలో కూర్చున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Related Posts