మీడియా మొఘల్ రామోజీరావు అస్తమయం

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (87) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 ని.లకు నిమిషాలకు తుది శ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.

చెరుకూరి రామోజీరావు.. ఒక భారతీయ వ్యాపారవేత్త. ఒకవైపు మీడియా, మరోవైపు వ్యాపారం, ఇంకోవైపు సినిమాలు, టెలివిజన్ సంస్థల నిర్వహణ.. ఇలా రామోజీరావు అనేక రంగాల్లో బహుముఖ ప్రఙ్ఞ కనబర్చారు. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకులైన రామోజీరావు.. ఈనాడుకి ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త గానూ వ్యవహరించారు. ఇంకా.. ఆయన వ్యాపార సామ్రాజ్యాల విషయానికొస్తే.. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి వంటి ఎన్నో సంస్థలున్నాయి.

రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుని దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు.

రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించారు. అందుకోసం చదువు పూర్తయ్యాకా ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగివచ్చారు.

రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం. ఆ తర్వాత 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. 1967 – 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్నీ సాగించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు. 1970లోనే విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించారు రామోజీరావు.

సినిమా రంగంలోనూ రామోజీరావు తిరుగులేని విజయాలందుకున్నారు. 1984లో ‘శ్రీవారికి ప్రేమలేఖ’ మొదలుకొని.. ‘మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, పీపుల్స్ ఎన్‌ కౌంటర్, అశ్వని, చిత్రం, ఇష్టం, నువ్వేకావాలి, ఆనందం, నిన్ను చూడాలని, నచ్చావులే’ వంటి ఎన్నో సినిమాలను ఉషాకిరణ్ మూవీస్ పై నిర్మించారు రామోజీరావు.

Related Posts