కరోనా వలన థియేటర్లు మూతపడడం.. ఓటీటీలకు డిమాండ్ పెరగడం తెలిసిందే. అసలు కరోనా లేకపోతే ఓటీటీలకు డిమాండ్ పెరగడం అనేది ఇప్పట్లో జరిగేది కాదు. ఇక డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనేది కూడా ఇప్పట్లో వినిపించేది కాదు. కరోనా పుణ్యమా అని సంవత్సరం టైమ్ లోనే ప్రతి యాప్ కు సగటు చందాదారుల సంఖ్య లక్షల్లోంచి కోట్లలోకి పెరిగింది. దీంతో క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసం.. అలాగే ధరలు పెంచడం విషయంలో ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఇవాళ నుంచి తన సంవత్సర చందాను ఏకంగా 500 రూపాయలకు పెంచింది.
నిన్నటి వరకు 999 ఉన్న ధరను ఈరోజు 1499 అయ్యింది. అలాగే నెలవారీ మొత్తంలోను మార్పులు చేసింది. వరల్డ్ రేటింగ్ టాప్ లో ఉన్న నెట్ ఫ్లిక్స్ అనూహ్యంగా ఇండియా ప్లాన్ లో రేటు తగ్గించింది. 199 నుంచే తన కంటెంట్ ని టీవీలో చూసే ఆప్షన్ ఇచ్చింది. ఒకవేళ మొబైల్ కే పరిమితం అవ్వాలనుకుంటే.. 149ది వాడుకోచ్చు. గతంతో పోలిస్తే.. ఇది భారీగా తగ్గించినట్టే. అయితే.. అమెజాన్ ప్రైమ్ పెంచిన రోజునే నెట్ ఫ్లిక్స్ తగ్గించడం ఖచ్చితంగా తెలివైన నిర్ణయం అని చెప్పచ్చు.
ఇటీవల ఓటీటీల మధ్య పోటీ బాగా పెరిగింది. సోనీ లీవ్ ఎంట్రీ ఇచ్చాకా ఓటీటీకి కౌంట్ పెరిగింది. డిస్నీ హాట్ స్టార్, ఆహా, ఊట్, హలు, లయన్స్ గేట్స్ ప్లే లాంటివి ఆడియన్స్ కి పలు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ రీజనబుల్ ప్యాకేజీలే. కరోనా తగ్గి థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ.. ఓటీటీలకు డిమాండ్ తగ్గలేదు. ఇప్పుడు చిన్న సినిమాలకు ఓటీటీనే బెస్ట్ ఆప్షన్ గా మారింది. దీంతో ఓటీటీల మధ్య పోటీ బాగా పెరిగింది.