నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం… బ్లాక్ బస్టర్ సాధించడం తెలిసిందే. మాంచి ఫామ్ లో ఉన్న బాలయ్య ఓవైపు హీరోగా నటిస్తునే.. మరో వైపు హోస్ట్ గా అన్ స్టాపబుల్ అంటూ తనదైన స్టైల్ లో షోను సక్సస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఆహా కోసం అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య టాక్ షో చేయనున్నారు అని ప్రకటించినప్పుడు బాలయ్య ఏంటి..? హోస్ట్ గా చేయడం ఏంటి..? అనుకున్నారు. దీంతో బాలయ్య టాక్ షో పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇప్పటి వరకు ఎనిమిది ఎపిసోడ్స్ ను పూర్తి చేసిన బాలయ్య తనదైన శైలిలో షోను నడిపిస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
మొదటి షోకు గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హాజరయ్యారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని, కామెడీ కింగ్ బ్రహ్మానందం, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, క్రేజీ స్టార్ రానా, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా చాలా మంది స్టార్స్ ఈ షోకు హాజరయ్యి ఆకట్టుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే… ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో బాలయ్య అన్ స్టాపబుల్ మొదటి స్థానంలో నిలిచింది. 9.7 పాయింట్లతో ఈ షో టాప్ లో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ది కపిల్ శర్మ షో నిలిచింది. ఈ షో 7.8 పాయింట్లు దక్కించుకుంది. ఇక అందాల భామ ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న అమెజాన్ ఫ్యాషన్ అప్ షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. మొత్తంగా బాలయ్య అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలవడం విశేషం.