సీనియర్ నటి గౌతమి తాజాగా తనను మోసం చేశారని చెన్నై పోలీస్ లకు చేసిన ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గౌతమి 17వ యేట నుంచి సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటి వరకూ 125కుపైగా సినిమాలు చేసింది.. అలా కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో శ్రీ పెరుంబుదూర్ లో 46 ఎకరాల పొలం కొన్నదట. అయితే కొన్ని రోజుల క్రితం తన కుటుంబ అవసరాల కోసం కొంత పొలాన్ని అమ్మి పెట్టాలని ఓ కన్స్ స్ట్రక్షన్ కంపెనీ ప్రెసిడెంట్ అయిన అళగప్పన్ ను కోరిందట. అతను ఆమె దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ పై సంతకం చేయించుకుని 4 కోట్లు ఇస్తామని చెప్పాడట. తను సంతకాలు చేసిన తర్వాత కేవలం 62 లక్షలు మాత్రమే ఇచ్చాడట. దీంతో పాటు తన సంతకాలు ఫోర్జరీ చేసి మొత్తం 25కోట్లు దోచుకున్నాడని తన కంప్లైంట్ లో పేర్కొంది గౌతమి.

అయితే గౌతమి సదరు అళగప్పన్ అనే వ్యక్తికి తన పొలం అమ్మేందుకు గానూ పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చింది. దీంతో అతను రకరకాల సంతకాలు చేయించుకుని ఏకంగా ఆమెకు సంబంధించిన 8 ఎకరాల పొలం లాగేసుకున్నాడట. ఇదేంటని అడిగినందుకు తనను చంపేస్తామని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.

గౌతమి పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లైన తర్వాత విడాకులు అయింది. 2004లో క్యాన్సర్ బారిన పడి నానా బాధలూ ఫేస్ చేసి ఆ మహమ్మారి బారి నుంచి బయటపడింది. ఆ తర్వాత కొంత కాలం పాటు కమల్ హాసన్ తో సహజీవనం చేసింది. అటుపై అతనితో విడిపోతున్నానని తనకు తానుగా ఆ బంధం తెంచుకుంది. ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసి తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటిస్తోంది. ఈ టైమ్ లో తనను మోసం చేయడమే కాక చంపేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ చేయడం సంచలనం అయింది. మరి ఈ వ్యవహారంలో కమల్ హాసన్ తో పాటు ముఖ్యమంత్రి స్టాలిన్ తనకు అండగా ఉంటారాఅనేది చూడాలి.