మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆచార్య. ఏ ముహుర్తాన మొదలుపెట్టారో కానీ.. మూడేళ్లకు పైగా నిర్మాణంలోనే ఉంది. ఎప్పుడో ఆచార్య విడుదల కావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆఖరికి గత సంవత్సరం డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే… అప్పుడు పుష్ప అడ్డంపడింది. దీంతో చేసేది ఏమీ లేక పుష్ప కోసం త్యాగం చేశారు.
జనవరిలో ఆర్ఆర్ఆర్ వస్తుందని.. ఆచార్యను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే… ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. మరో విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన తర్వాతే ఆచార్య విడుదల చేయాలనేది రాజమౌళితో ఒప్పందం. ఒకవేళ ఇప్పటికే ఆలస్యం అయ్యింది కాబట్టి ఆచార్యను ముందుగా విడుదల చేయడానికి జక్కన్న ఓకే చెబితే ఓ ఛాన్స్ దక్కుతుంది. ఇది జరిగినా జరగకపోయినా.. ఏపీలో ఈ నెల 31 వరకు 50 శాతం సిటింగ్ అండ్ నైట్ కర్ఫ్యూలు అమలులోకి వచ్చాయి.
ఆతర్వాత పొడిగించరనే గ్యారెంటీ లేదు. అలా చేస్తే… ఆచార్య రావడం చాలా కష్టం. దీనికి తోడు టిక్కెట్ల రేట్ల పై కోర్టు హియరింగ్ ఫిబ్రవరి 10న ఉంది. ఈలోపు ఆచార్య రిలీజ్ చేస్తే… పాత టిక్కెట్ల రేట్లకే టిక్కెట్లను అమ్మాల్సి వస్తుంది. దీనికి నిర్మాతలు రెడీగా ఉండకపోవచ్చు. ఇదంతా చూస్తుంటే.. ఆచార్య ఎప్పుడు వస్తుందో మేకర్స్ కి కూడా తెలియని పరిస్థితి అనిపిస్తుంది. పాపం.. ఆచార్య.. మోక్షం ఎప్పుడో..? అభిమానులు ఆనందపడేది ఎప్పుడో..?