అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా కోసం ఇప్పటి వరకూ ఎవరూ చేయని ఫీట్ చేస్తున్నాడు. తన పాత్ర గురించిన వివరాల కోసం రెక్కీ నిర్వహిస్తున్నాడు. చందు మొండేటి డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది.
ఈ మూవీలో చైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకే తన పాత్ర సాగే శ్రీకాకుళం జాలరుల వద్దకు వెళ్లి వారి గురించిన వివరాలు తెలుసుకున్నాడు. చేపలు పట్టేందుకు వారు సముద్రంలోకి వెళ్లేందుకు ఎలా ప్రిపేర్ అవుతారు. ఆ టైమ్ లో వారి కుటుంబాల్లో ఉండే భావోద్వేగాలు ఎలా ఉంటాయి. ఆ సందర్భాల్లో వారి జీవిన విధానం ఎలా ఉంటుంది.. ఆటుపోట్లు, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారు వంటి అనేక అంశాలను వారితో మాట్లాడి తెలుసుకుంటున్నాడు.
అంతే కాదు.. ఈ మూవీలో చైతన్య ఫిషింగ్ బోట్ ను నడిపే వ్యక్తి పాత్ర చేస్తున్నాడు. అందుకే అలాంటి కొందరు వ్యక్తులతో కలిసి ఏకంగా సముద్రంలోకి వెళ్లాడు. బోట్ నడుపుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలలకు ఎదురుగా వెళుతున్నప్పుడు బోట్ నడిపేవారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది వంటి విషయాలను సముద్రంలోకే వెళ్లి స్వయంగా అధ్యయనం చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా కొన్నాళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతోంది. అప్పట్లో కొందరు జాలరులు చేపల వేటకు వెళ్లి సముద్ర జలాల్లో తప్పిపోయి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లో కలిసిపోయారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్లు వీరిని అరెస్ట్ చేస్తారు. అక్కడ రెండు నెలల పాటు జైల్లో ఉంచుతారు. ఆ సమయంలో వీరి కుటుంబాలు ఎదుర్కొన్న సంఘర్షణలను గొప్పగా చూపించబోతున్నాడట చందు మొండేటి.
చైతూ పాత్ర అలా సముద్ర జలాల్లోకి వెళుతున్నప్పుడు అతని భార్య నిండు చూలాలుగా ఉంటుంద. తను పాకిస్తాన్ జైలులో ఉన్నప్పుడే ఆమె ప్రసవం అవుతుందంట. అంతకు ముందు వీరి ప్రేమకథ ఉంటుందని టాక్. మొత్తంగా నాగ చైతన్య ఇలా రెక్కీగా ఒరిజినల్ లొకేషన్ తో పాటు అప్పట్లో పాకిస్తాన్ లో చిక్కుకున్న జాలరులనే కలుసుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.