అక్కినేని నాగార్జున కొన్నాళ్లుగా ఫామ్ లో లేడు. అయినా ఆయన క్రేజ్ తగ్గిందని చెప్పలేం. ఒక సాలిడ్ హిట్ పడితే మళ్లీ అంతా సెట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆయన పాత సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందా అనిపిస్తోంది. ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది కదా.. ఈ ట్రెండ్ లో బ్లాక్ బస్టర్ కాని సినిమాలను కూడా మళ్లీ విడుదల చేస్తున్నారు.
వాటికంటే బ్లాక్ బస్టర్ మూవీస్ కే ఎక్కువ క్రేజ్ ఉంటోంది. అందుకే అక్కినేని నాగార్జున కెరీర్లోనే మోస్ట్ మెమరబుల్ మూవీ అనదగ్గర మన్మథుడు చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు అభిమానులు.
ఈ నెల 29న నాగ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే 4 కే టెక్నాలజీకి అనుకుణంగా అన్ని మార్పుల చేశారు. ఆల్రెడీ టికెట్స్ ను కూడా అమ్మేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఇప్పటికే ఎన్నోసార్లు టివిల్లో వచ్చిన.. యూ ట్యూబ్ ల్లో చూసిన ఈ చిత్రం రీ రిలీజ్ కు మొదటి రోజు మార్నింగ్ 8 గంటల షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆల్రెడీ హౌస్ ఫుల్ అయిపోయింది.
రిలీజ్ కు ఇంకా వారం టైమ్ ఉన్నా మొదటి ఆట అప్పుడే హౌస్ ఫుల్ అంటే ఇక మిగతా షోస్ కూడా చాలా వేగంగా ఫిల్ అయిపోతాయని వేరే చెప్పాలా.. ఈ ఫుల్స్ అన్నీ కంటిన్యూ అయితే.. సీనియర్ హీరోల్లో నాగార్జున మూవీ కొత్త రికార్డ్ క్రియేట్ చేసినా ఆశ్చర్యం లేదేమో.
విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన మన్మథుడు చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ అందించారు. ఫుల్ లెంగ్త్ పంచ్ లతో త్రివిక్రమ్ రెచ్చిపోతే.. నాగ్, బ్రహ్మానందం, సునిల్,ధర్మవరపు తో పాటు మిగతా ఆర్టిస్ట్ లంతా చెలరేగిపోయి మాంచి టైమింగ్ తో అదరగొట్టారు. ఆ టైమ్ లో నాగార్జున మన్మథుడు అనే టైటిల్ కు అచ్చంగా పేటెంట్ తనదే అన్నట్టుగానే ఉన్నాడు.
అలాంటి వ్యక్తికి అమ్మాయిలంటే పడదు అనే ట్యాగ్ లైన్ పెట్టేసరికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. నాగ్ సరసన సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఎప్పుడు చూసినా ఆవకాయలా బోర్ కొట్టదు. ఈ కారణంగానే మరోసారి థియేటర్స్ లో చూసేందుకు జనం ఎగబడుతున్నారు.