మోస్ట్ అవెయిటింగ్ ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. మోస్ట్ అవేటింగ్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఈ మూవీ నుంచి ప్రభాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బాణాన్ని ఆకాశం వైపు ఎక్కు పెట్టినట్లు ఉందీ పోస్టర్ . సినిమా క్యాప్షన్ లో రాసినట్లు చెడుపై మంచి విజయాన్ని సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది సినిమాలో అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ పోస్టర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు ఓం రావత్ స్పందిస్తూ…ఈ మ్యాజికల్ జర్నీలో భాగమయ్యేందుకు అక్టోబర్ 2న సాయంత్రం 7.11 నిమిషాలకు అయోధ్యకు వచ్చేయండి అని ఆహ్వానించారు. అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓంరావత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెరపైకి రానుంది.

Related Posts