ఖిలాడీ దర్శకుడు.. కామెడీ సినిమా

ఒకటీ రెండు హిట్స్ పడే వరకూ ఏ దర్శకుడైనా స్ట్రగుల్ అవుతాడు. ఆ తర్వాత అంతా సాఫీగా ఉంటుంది అనుకుంటే పొరబాటే. ఇండస్ట్రీలో ఉండాలంటే నిరంతరం సక్సెస్ లోనే ఉండాలి. లేకపోతే సింపుల్ గా పక్కనబెట్టేస్తారు.అప్పుడెప్పుడో 2005లో తరుణ్ హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడు ఒక ఊరిలో అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు రమేష్‌ వర్మ.

తర్వాత రైడ్ అనే చిత్రంతో మెప్పించాడు. బట్ ఎప్పుడూ హిట్ అనిపించుకోలేదు. అయినా రవితేజ నమ్మాడు. నాటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఫ్యాక్షన్ అనే పదమే లేదు కానీ.. దాదాపు ఆ తరహా కంటెంట్ తోనే వీర అనే సినిమా చేశాడు. ఇది ఊర ఫ్లాప్ అయింది. అటుపై చాలా గ్యాప్ తీసుకుని నాగ శౌర్యతో అబ్బాయితో అమ్మాయి అన్నాడు. అదీ పోయింది.

ఫైనల్ గా తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన రాచ్చసన్ ను తెలుగులో మక్కీకి మక్కీ దించేసి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తే అది ఇక్కడా బ్లాక్ బస్టర్ అయింది. ఇంకేం ఈ ట్యాగ్ తో మళ్లీ మాస్ రాజాను అప్రోచ్ అయ్యాడు. రవితేజ కూడా ఇతను హిట్ ట్రాక్ ఎక్కడాని డేట్స్ ఇచ్చాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన ఖిలాడీ సినిమా పోయింది. దీంతో మరోసారి క్రాస్ రోడ్స్ లోకి వచ్చాడు రమేష్‌వర్మ.


అయితే ఖిలాడీ పోయినా.. అతని టేకింగ్ చాలామందికి నచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా ఓ కథ సిద్ధం చేసుకుని వినిపించాడు. లారెన్స్ కూడా ఓకే చెప్పాడు. అయితే ఈ చిత్రం పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. ఆ టైమ్ కోసం ఎదురుచూస్తోన్న రమేష్‌ వర్మకు అనుకోకుండా ఓ హారర్ కామెడీని రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది.


2022లో బాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భూల్ భులయ్యా 2ను తెలుగులో రీమేక్ చేయమని ఓ పెద్ద ప్రొడ్యూసర్ అతని వద్దకు వచ్చాడట. లారెన్స్ సినిమాకు టైమ్ ఉంది కాబట్టి దీనికి ఓకే చెప్పాడు. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కు తగ్గట్టుగా కథలోమార్పులు జరుగుతున్నాయి. అలాగే హీరోల కోసం కూడా వేట సాగుతోంది.

హిందీలో ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీజంటగా నటించారు. టబు, రాజ్ పాల్ యాదవ్, అమర్ ఉపాధ్యాయ్ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం వినిపించేదాన్ని బట్టి తెలుగు వెర్షన్ కోసం నాగ చైతన్య, కళ్యాణ్‌ రామ్, వరుణ్‌ తేజ్ లాంటి వారిని పరిశీలిస్తున్నారట. మరి ఈ రీమేక్ కు ఈ హీరోలు ఓకే చెబుతారా లేదా అనేది అప్పుడే చెప్పలేం.

Related Posts