ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించడం.. తనిఖీలు చేస్తూ.. కొన్ని థియేటర్లను సీజ్ చేస్తుండడం తెలిసిందే. దీంతో ఏపీలో టిక్కెట్ల రేట్లు అనేది వివాదస్పదం అవుతుంది. ఇటీవల హీరో నాని చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోను ఇటు సినీ వర్గాల్లోను సంచలనంగా మారాయి. అయితే.. ఈరోజు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో టిక్కెట్ల రేట్లు గురించి ఎవరూ తొందరపడి మాట్లాడద్దు అని చెప్పారు.
ఇంకా దిల్ రాజు మాట్లాడుతూ.. మాకు అపాయింట్మెంట్ ఇస్తే చిత్ర పరిశ్రమ తరఫున సీఎం, మంత్రుల్ని కలవానుకుంటున్నాం. తెలంగాణలో వచ్చినట్టే ఏపీలోనూ ఓ జీవో వస్తుందని ఆశిస్తున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సినీ పెద్దలు సభ్యులుగా ఉన్నారు. సినిమా వాళ్లెవరూ ఈ అంశాల పై మాట్లాడొద్దు. సినిమా వార్తల విషయంలో మీడియా కూడా సంయమనం పాటించాలి. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉంది. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాం అన్నారు.