సౌత్ స్టార్స్ గురించి కంగ‌నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కంగనా రనౌత్‌… త‌న సినిమాల క‌న్నా.. త‌న కామెంట్స్ తోనే ఎక్కువుగా వార్త‌ల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్ అడ్ర‌స్ కంగ‌నా. లేటెస్ట్ గా సౌత్ స్టార్స్ పై కంగనా చేసిన కామెంట్స్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నాయి. సౌత్ ఇండస్ట్రీని పొగ‌డ్త‌ల‌తో ఆకాశానికి ఎత్తేసిన కంగ‌నా.. బాలీవుడ్ పై మాత్రం విరుచుకుప‌డింది. ఇంత‌కీ కంగ‌నా ర‌నౌత్ ఏమ‌న్న‌దంటే… సౌత్‌ స్టార్స్‌ అల్లు అర్జున్‌, యశ్‌ల ఫోటోలు షేర్‌ చేసిన కంగనా దక్షిణాది హీరోలకు, సినిమాలకు ఎందుకు అంత ఆదరణ లభిస్తుందన్నది ప్రస్తావించింది.

దక్షిణాది స్టార్స్‌ మన దేశ సంస్కృతి సంప్ర‌దాయ మూలాల‌కు క‌ట్టుబ‌డి ఉంటారు. వారు త‌మ కుటుంబాల‌కు, బాంధ‌వ్యాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. సినిమా పై వారికున్న ప్యాష‌న్‌, వృతిప‌ర‌మైన నిబ‌ద్ధ‌త అపార‌మైన‌ది అంటూ ఇన్‌స్టా స్టోరీలో కంగ‌నా రాసుకొచ్చింది. అంతేకాకుండా.. బాలీవుడ్‌ మిమ్మల్ని పాడు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. వారి వ‌ల‌లో చిక్కుకోకండి అంటూ అల్లు అర్జున్, య‌శ్ ల‌కు త‌న‌దైన స్టైల్ లో స‌ల‌హా ఇచ్చేసింది. దీనికి పుష్పలోని ఊ అంటావా.. ఊఊ అంటావా అనే సాంగ్‌ను సైతం యాడ్‌ చేసింది.

ఈ కంగ‌నా కామెంట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక కేజీఎఫ్‌, పుష్ప సినిమాలతో యశ్‌, అల్లుఅర్జున్‌ పాన్‌ ఇండియా స్థాయిలో ఎంతలా పాపులారిటీ తెచ్చుకున్నారో తెలిసిందే. అయితే… కంగ‌నా కామెంట్స్ పై అల్లు అర్జున్ కానీ… య‌శ్ కానీ స్పందించ‌లేదు. మ‌రి… బాలీవుడ్ స్టార్స్ ఎవ‌రైనా స్పందిస్తారేమో చూడాలి. ఈవిధంగా మ‌రోసారి కంగ‌నా వార్త‌ల్లో నిలిచింది.

Related Posts