నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో సంచలన విజయాలు సాధించారు. ఆడియన్స్ ని ఎంతగానో అలరించారు. బాలయ్య నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అయితే.. వంద చిత్రాలు పూర్తి చేసిన తర్వాత ఎవరైనా స్పీడు తగ్గిస్తారు. ఆచితూచి సినిమాలు చేస్తారు కానీ.. బాలయ్య రూటే వేరు కదా.. 100 చిత్రాల తర్వాత మరింతగా స్పీడు పెంచారు. బాక్సీఫీస్ వద్ద దూసుకెళుతున్నారు.
గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత పైసా వసూల్ సినిమా చేశారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పైసా వసూల్ చిత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఆతర్వాత జై సింహా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్.. ఇలా వరుసగా సినిమాలు చేశారు. తాజాగా అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం అఖండ రికార్డు కలెక్షన్స్ సాధిస్తుండడం విశేషం.
ఇప్పుడు బాలయ్య మరింత స్పీడు పెంచారు. అఖండ తర్వాత మలినేని గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా తర్వాత సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జూన్ లేదా జులైలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మరో సినిమా చేయనున్నారు. గతంలో ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్టుగా ఉండేది బాలయ్య ఆలోచన కానీ.. ఇప్పుడు కంప్లీట్ గా రూటు మార్చారు. చేతిలో మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి.. ఈ మూడు చిత్రాలతో కూడా బాలయ్య బ్లాక్ బస్టర్స్ సాధిస్తారని ఆశిద్దాం.