ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. 1943 డిసెంబరు 10న జన్మించిన మాణిక్య వినాయగం. తన మామయ్య, గాయకుడు సీఎస్ జయరామన్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. దిల్ (2001) అనే తమిళ చిత్రంతో చిత్ర పరిశ్రమలో గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అన్ని భాషల్లో కలిపి 800లకి పైగా పాటల్ని పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు.
ఆయన పాడిన ప్రతి పాటా సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగించింది. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలోని.. పట్టుపట్టు చేయ్యే పట్టు అనే పాటతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. ఈ విధంగా గాయకుడిగానే కాకుండా.. నటుడిగానూ తనదైన ముద్రవేశారు. మాణిక్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.