40 మిలియన్‌ ప్లస్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’– నటుడు నిర్మాత అలీ

అలీ, నరేశ్‌లు ముఖ్యపాత్రల్లో నటించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించి మెప్పించిన చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మౌర్యాని, పవిత్రా లోకేశ్‌ కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుత సమాజంలో సోషల్‌ మీడియా వల్ల రోజుకో రకంగా ఎవరో ఒకరు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియానే తమ కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. 40రోజుల క్రితం ఆహా ఓటీటీ చానల్‌లో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ విడుదలైంది ఈ సినిమా. విడుదలైన రోజు నుండి ఈ రోజు వరకు రకరకాల కాంప్లిమెంట్స్‌ వచ్చాయి.

సినిమాలో నటించిన నటీ నటులందరికి మెసేజ్‌ల రూపంలో ఇప్పటికి రోజు మెసేజ్‌లు అందుతున్నాయి అన్నారు అలీ అండ్‌ టీమ్‌. ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అలీ సమర్పణలో మోహన్‌ కొణతాల, అలీబాబా, శ్రీచరణ్‌ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించారు. 40 మిలియన్ల ప్లస్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ వ్యూస్‌ను సాధించిన సందర్భంగా నిర్మాత నటుడు అలీ మాట్లాడుతూ–‘‘ సినిమా అనేది వ్యాపారమే కానీ, ఆ వ్యాపారంలో కూడా మంచి విషయాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్ధేశ్యంతో ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’ సినిమాను తీయటం జరిగింది. సినిమా విడుదలైన రోజు నుండి మీ సినిమా ఇప్పటికి ఐదారుసార్లు చూశాను ఎవరెవరో నా ఫోన్‌ నెంబర్‌ సంపాదించి నాతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది.

ఓటీటీలో విడుదలైన మొదటివారమే రెండు కోట్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో సంచలనం విజయం సాధించిన మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత మా సినిమాను అనేక పైరసీ వెబ్‌సైట్స్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని చూస్తున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. అయినా కూడా సినిమా చూసిన అందరూ మంచి సినిమా తీశారు అని మెసేజ్‌లు పంపుతుంటే నేను, నాతో పాటు మా టీమంతా గొప్ప సినిమా తీసినందుకు ఆనందంగా ఫీలవుతున్నాం. త్వరలోనే ప్రముఖ తెలుగు శాటిలైట్‌ చానల్‌ ఈ టీవిలో మా సినిమా ప్రసారం కానుంది. అలాగే కొంతకాలం తర్వాత ప్రముఖ ఓటీటీ చానల్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని నా అభిమాన ప్రేక్షకులందరికి తెలియచేస్తున్నా.

నా సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నరేశ్‌ , నాతో పాటు నా గురువులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, అతిథి పాత్రలో హీరో శివబాలాజి, సీనియర్‌ నటి మంజుభార్గవి, రామ్‌జగన్, సనా, ఆడిటర్‌ వివేక్, సప్తగిరి, భద్రం, ప్రణవి మానుకొండ, యాంకర్‌ లాస్య, గీతాసింగ్, శివారెడ్డి, జేమ్స్‌ మధు, రవిప్రకాశ్, యల్‌బి. శ్రీరామ్, అనంత్‌ తదితరులు నటించి మా సినిమాకు నిండుదనాన్ని తీసుకువచ్చారు. అందరికి కృతజ్ఙతలు ’’ అన్నారు అలీ.

Related Posts