ఫిబ్రవరి సినిమాల పరిస్థితేంటీ.. రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్న సినిమాలేంటీ..?

ఒక్క మార్పు.. పరిశ్రమనే కుదిపేసింది. ఆ మార్పు పేరు ఆర్ఆర్ఆర్. వీళ్లు దసరాకు వచ్చినా పోయేది అని టాలీవుడ్ అంతా ఫీలవుతోంది. వీళ్లు పోస్ట్ పోన్ కావడంతో ఇప్పుడు ఫిబ్రవరి సినిమాలకూ కొత్త చిక్కొచ్చింది. ఆ చిక్కుకు మరో కారణం ఒమిక్రాన్ భయం. మరోవైపు కరోనా కూడా విజృంభిస్తోంది. మరి ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన సినిమాల సంగతి పక్కన బెడితే.. ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యే మూవీస్ అయినా వస్తాయా..? అసలు ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న చిత్రాలేంటీ..?
సంక్రాంతిని భారీ కాన్వాస్ తో ఊహించుకుంది టాలీవుడ్. అటు ప్రేక్షకులు కూడా భీమ్లానాయక్, రాధేశ్యామ్, సర్కారువారి పాట, ఎఫ్3, బంగార్రాజు అంటూ అబ్బో చాలామందితో ఈ సారి సంక్రాంతి ముందెన్నడూ లేనంత గొప్పగా ఎంటర్టైన్ చేయబోతోందనుకున్నారు. కానీ అదే టైమ్ కు ఆర్ఆర్ఆర్ అనౌన్స్ కాగానే అంతా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కేవలం రాధేశ్యామ్, బంగార్రాజు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు చూస్తే ఒమిక్రాన్ కారణంగా ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. దీంతో పోస్ట్ పోన్ అయిన సినిమా మేకర్స్ అంతా తెగ ఫీలైపోతున్నారట.
ఆర్ఆర్ఆర్ వాయిదాకు కారణం ఒమిక్రాన్. దీనివల్ల థియేటర్స్ మూతపడుతున్నాయి. చాలా చోట్ల కేవలం 50శాతం ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఇచ్చారు. అటు విదేశాల్లో సైతం ఇదే సీన్. ఇది కేవలం ఆర్ఆర్ఆర్ నే కాదు అన్ని చిత్రాలను ఇబ్బంది పెడుతుంది కదా..? అలా చూస్తే ఫిబ్రవరిలో వస్తోన్న సినిమల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఇక ఫిబ్రవరిలో ముందుగా వస్తోన్న సినిమా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య.
ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కాబోతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే దసరా రేస్ నుంచి వెనక్కి వెళ్లిందీ చిత్రం. మరి ఇప్పుడు ఒమిక్రాన్ పెరుగుతోంది కాబట్టి.. వీళ్లు కూడా వాయిదా వేస్తారా లేక నెల రోజుల్లో వచ్చే మార్పులను బట్టి బరిలోకి దిగుతారా అనేది చూడాలి.
ఫిబ్రవరి 11న విడుదల కాబోతోన్న మరో పెద్ద సినిమా ఖిలాడీ. రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిచారు. రమేష్ వర్మ దర్శకుడు. అయితే సినిమా ఇంకా కొంత బ్యాలన్స్ ఉందనే టాక్ ఉంది. ఇక ఇదే రోజున మేజర్ మూవీని కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ముంబై దాడుల్లో చనిపోయిన మేజర్ ఉన్నిముకుందన్ కథతో వస్తోన్న ఈ చిత్రంలో అడవి శేష్ మెయిన్ రోల్ చేశాడు. మరి వీళ్లు ఆ డేట్ కు రాగలరా లేదా అనేది కూడా కొత్త వైరసే డిసైడ్ చేస్తుంది.
అడపాదడపా విజయాలతో ఆకట్టుకుంటోన్న హీరో నిఖిల్ నటించిన సినిమా 18పేజెస్. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గీతాఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. వీళ్లు కూడా చాలా రోజుల క్రితమే 18పేజెస్ ను ఫిబ్రవరి 18న విడుదల చేస్తాం అని ప్రకటించారు. మరి కుదురుతుందా..?
సంక్రాంతి బరి నుంచి బలవంతంగా వెనక్కి నెట్టబడిన భీమ్లా నాయక్ కూడా ఫిబ్రవరిలోనే బాక్సాఫీస్ ను హోరెత్తించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తాం అని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడం అనేది ఒమిక్రాన్ విస్తరణపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే గతంలో రెండు వేవ్స్ లో వణికించిన కరోనా కూడా ఫిబ్రవరి చివరి నుంచే ప్రపంచాన్ని భయపెట్టింది. ఇప్పుడు మరోసారి అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. పైగా ఈ నెల నుంచే చాలా రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. కానీ లక్షలమంది ఉపాధి పొందే పరిశ్రమకు కష్టం అంటే అన్ని కుటుంబాలకు ఇబ్బందే అని అర్థం. అందుకే ఈ సిట్యుయేషన్ పోవాలని.. అంతా సక్రమంగా జరగాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేం.

Related Posts