కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. మళ్లీ థియేటర్లు మూతపడడం.. ఓటీటీలకు మళ్లీ టైమ్ రావడం జరుగుతుంది. అయితే… కొంత మంది నిర్మాతలు ఓటీటీలకు సినిమాలను ఇస్తున్నప్పటికీ… మరి కొంత మంది నిర్మాతలు.. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చినా నో చెబుతున్నారు. ఓటీటీ వద్దు.. థియేటరే ముద్దు అంటున్నారు.
అలా.. భారీ ఓటీటీ ఆఫర్ ని వద్దు అన్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఆర్ఆర్ఆర్ గురించే. ఆర్ఆర్ఆర్ మూవీకి 350 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారట. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ మేకర్స్ నో చెప్పారని సమాచారం. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీకి 300 కోట్ల ఆఫర్ వచ్చిందట. రాధేశ్యామ్ మేకర్స్ కూడా అంతే.. సున్నితంగా నో చెప్పారట. అలాగే అజిత్ వలిమై చిత్రానికి 300 కోట్లు ఆఫర్ ఇచ్చినా బోనీకపూర్ నో చెప్పారని చెన్నై సమాచారం.
ఇక ఈగ విలన్ సుదీప్ నటించిన విక్రాంత్ రోణాకు 100 కోట్ల ఆఫర్ వచ్చిందట. అయినప్పటికీ నో చెప్పారట. స్వయంగా ఆ చిత్ర నిర్మాతే తెలియచేశారు. ఈ నాలుగు సినిమాలకే డీల్ 1000 కోట్ల దాటడం విశేషం. దీనిని బట్టి ఓటీటీ బిజినెస్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా కరోనా మూలంగా ట్రెండ్ మారడం వలన జరిగిన పరిణామం అని చెప్పచ్చు. హిందీ, మలయాళంలో ఎక్కువుగా డిజిటల్ ప్రీమియర్లు జరుగుతున్నాయి. తెలుగులో కాస్త తక్కువే. మరి.. రానున్న కాలంలో తెలుగులో కూడా డిజిటల్ ప్రీమియర్స్ పెరుగుతాయోమో చూడాలి.