ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల వ్యవహారం ఎంతటి సంచనలం సృష్టించిందో తెలిసిందే. ఇటు సినీ వర్గాల్లోను ఇటు రాజకీయ వర్గాల్లోను దీని గురించే చర్చ జరుగుతుంది. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ బాగా దెబ్బతిన్నది. అందుచేత పరిశ్రమ కోలుకునేలా భారీ చిత్రాలకు రేట్లు పెంచుకునేలా టిక్కెట్ల రేట్లు పెంచాలని నిర్మాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ.. ప్రభుత్వం మాత్రం అన్ని సినిమాలకు ఒకేలా రేట్లు ఉంచాలని ప్రయత్నం చేస్తుండడం వివాదస్పదం అవుతుంది.
ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా ఈ వ్యవహారంపై స్పందించడం సంచలనం అయ్యింది. ఇంతకీ రోజా ఏమన్నారంటే.. పేద ప్రజల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ లాంటి స్నేహపూర్వకమైన ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూసి ఉండం. చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ పెద్దలు ఆన్లైన్ టికెటింగ్ పెట్టాలని ఎన్నోసార్లు కోరడం వల్లే జగన్ సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లోనే అమ్మేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సినిమా వాళ్లతో చర్చలు జరిపి, వాళ్ల అభ్యర్థన మేరకే ఇప్పటి వరకూ ఆయన అన్నీ చేశారు కానీ.. ఇప్పుడు కొంత మంది రాజకీయ లబ్ధి కోసం దీన్ని సమస్యగా మార్చి వివాదస్పదం చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఇది తెలుసుకుని మిగిలిన సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే చర్చలకు వస్తున్నారు. కాబట్టి త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. అంతా మంచే జరుగుతుంది అన్నారు.