నారాయణ దాస్ నారంగ్కు పరిశ్రమ నివాళి
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ నారాయణ దాస్ నారంగ్ అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే! ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నారాయణ దాస్ నారాంగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సమస్య చిన్నదైనా, పెద్దదైనా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య మళ్లీ రాకుండా పరిష్కారం చేస్తారు. ఛాంబర్కు సంబంధించిన విషయాల్లో చాలా యాక్టివ్గా పాల్గొవడం, మంచి సలహా, సూచనలు ఇస్తూ అభివృద్ధి దిశగా ఎలా వెళ్లాలో చెబుతుండేవారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాఽధగా ఉంది’ అని అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ‘‘ఎన్టీఆర్ కాలంనాటి నుంచి నారయణ దాస్ నారంగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత, ఫైనాన్షియర్గా పరిశ్రమకు సేవలందించారు. ఏ రోజు ఆయన చేసిన సేవలు బయటకు చెప్పుకోలేదు. మాట ఇస్తే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అదే పద్దతి ఆయన తనయుడు సునీల్కు వచ్చింది. అదే పద్థతి వాళ్ళ అబ్బాయి సునీల్ గారికి వచ్చింది. చిన్న సినిమాలకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించారు’’ అని అన్నారు.
వై.వి.యస్ చౌదరి మాట్లాడుతూ ‘‘నారాయణదాస్ గారి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. సినిమాకు ఎలాంటి కష్టం వచ్చిన దాని నుంచి బయట పడేసి ముందుకు తీసుకెళ్తారు. ఎవరితోనూ గొడవలు లేకుండా ఇరువైపులవారికి న్యాయం జరిగేలా చేస్తారు’’ అని అన్నారు.
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘‘అమెరికాలో ఉన్నప్పటి నుంచీ దాసుగారితో పరిచయం ఉంది. ఆయనకు థియేటర్ రంగంలో అంటే చాలా ఇష్టం. అందుకే ఏషియన్ థియేటర్స్ నిర్మించారు. రిజనబుల్ రేట్లు, మంచి సౌకర్యాలతో థియేటర్లను నడిపిస్తున్నారు. ఆడియన్స్ మనకు దేవుళ్లు అని తరచూ చెబుతుండేవారు’’ అని అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘నా సినిమాను ఆయన సినిమాగా భావించి ఎన్నోసార్లు నా సినిమాలు విడుదల చేశారు. ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడేవారు. ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాత మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయనతో ఉన్న అనుబంధం, అనుభవాలు కళ్లల్లో మెదులుతున్నాయి’’ అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.రావు, పద్మిని నాగులపల్లి, తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.