కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పాత హీరోల మధ్య కూడా కొత్తగా పోటీ మొదలవుతుంది. ఈ ట్రెండ్ మొదలుపెట్టిన వాళ్లు సక్సెస్ అయితే మిగతా వాళ్లు కూడా వారిలా సత్తా చాటాలని భావిస్తారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లూ చేస్తారు. బట్.. కొన్ని సాధించడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ముందు వచ్చిన హిట్టో లేక ట్రెండో.. రిలీజ్ అయిన డేట్, టైమ్ కూడా ఓ కారణం అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటారా..? పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మొదలైన ట్రెండ్ లో ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్రెండ్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎంటర్ అవుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ను దాటే సత్తా మహేష్ బాబుకు ఉంటుందా..?

2022 పాత సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం.. అనే ఓ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. అఫ్ కోర్స్ ఇది మరీ కొత్తదేం కాదు. మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచీ ఉన్నదే. కాకపోతే ఇప్పుడు ఆడియన్స్ కంటే ఫ్యాన్స్ మైండ్ సెట్ మారింది కదా.. అందుకే ఇదో క్రేజ్ అయిపోయింది. ఆ క్రేజ్ లో వచ్చిన సినిమాలు ఒకటీ రెండు రోజుల పాటు ఫ్యాన్స్ ను అలరించాయి. అయితే అవి పర్టిక్యులర్ సెలబ్రేషన్ లో వచ్చిన సినిమాలు. కానీ ఇయర్ ఎండింగ్ లో న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఏదో ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ సినిమ విడుదలైనప్పుడు ఎంత హంగామా ఉంటుందో అంతకంటే ఎక్కువే చేశారు ఫ్యాన్స్. హంగామా మాత్రమే కాదు.. కలెక్షన్స్ పరంగానూ ఓ కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది ఖుషీ. మొదటి రోజే ఏకంగా 3 కోట్ల 50లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఓ మీడియం రేంజ్ హీరో సినిమాకు హిట్ టాక్ వస్తే ఎంత ఓపెనింగ్స్ వస్తాయో అంతకు సమానం ఈ కలెక్షన్స్.

ఇప్పటికే ఎన్నోసార్లు టివిల్లో వచ్చి, యూ ట్యూబ్ లోనూ అందుబాటులో ఉన్న సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ అంటే అది హీరో రేంజ్ గానే చూడాలి. ఇక ఈ మూవీ తర్వాత ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వారందరికీ ఓ టార్గెట్ ఫిక్స్ చేసింది ఖుషీ. ఇక ఈ లిస్ట్ లో ఫస్ట్ వస్తోన్న చిత్రం మహేష్ బాబు ఒక్కడు. గతంలో మహేష్ బర్త్ డే రోజు మాత్రం కొన్ని షోస్ వేశారు. బట్ ఈ సారి ఖుషీ రేంజ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.

ఒక్కడు మహేష్ బాబుకు వచ్చిన ఫస్ట్ సాలిడ్ మాసివ్ బ్లాక్ బస్టర్. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు నిర్మించాడు. విశేషం ఏంటంటే.. ఖుషీ చూసిన తర్వాతే భూమికను ఈ చిత్రంలోనూ హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఒక్కడు ఈ శనివారం విడుదల చేయబోతున్నారు ఫ్యాన్స్. ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నికల్ గా అన్ని మార్పులను ఆల్రెడీ చేసుకున్న ఒక్కడుకు ఇప్పుడు ఖుషీ మూవీ పెద్ద టార్గెట్ పెట్టింది. మరి ఈ టార్గెట్ ను ఒక్కడు ఛేదిస్తాడా లేదా అనే హాట్ డిస్కషన్స్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్నాయి.