కెరీర్ లో ఎప్పుడూ హిట్, ఫ్లాప్స్ తో పనిలేకుండా దూసుకుపోయిన స్టార్ బాలకృష్ణ. అఖండ తర్వాత లేటెస్ట్ గా వీర సింహారెడ్డితో మరో బ్లాక్ బస్టర్ అందుకుని ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉన్నాడు బాలయ్య. ఈ జోష్ లోనే కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇది పూర్తిగా అనిల్ మార్క్ లో సాగే ఎంటర్టైనర్ అంటున్నారు. అలాగే డాటర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లబోతోంది.

ఈ మూవీ తర్వాత ఎన్నికలకు ముందు వచ్చేలా మరోసారి బోయపాటి శ్రీనుతో సినిమా ఉండబోతోంది. అయితే ఈ రెండు సినిమాల మధ్యలో మరో మూవీకి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అ అనే సినిమాతో ఆకట్టుకుని.. తర్వాత కల్కి చిత్రంతో మెప్పించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో బాలయ్య సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ రీసెంట్ గా తీసిన జాంబిరెడ్డి మూవీ కమర్షియల్ గానూ మంచి హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే చిత్రాన్ని రూపొందించాడు.

రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ టీజర్ కు దేశవ్యాప్తంగా అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. దీంతో ఈ మూవీని ప్యాన్ ఇండియన్ లెవల్లో విడుదల చేయబోతున్నారు. మామూలుగా ఇలాంటి సినిమాలను బాలయ్య బాగా ఇష్టపడతాడు. మరి అతనికీ ఈ తరహాలోనే సాగే కథ చెప్పాడా లేక ఇంకేదైనా కొత్త కథా అనేది తెలియదు కానీ.. ఆల్మోస్ట్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కన్ఫార్మ్ అయినట్టే.

ఇక ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమా బ్యానప్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించబోతున్నాడు. ఈ యేడాది చివరి నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంటున్నారు. మొత్తంగా బాలయ్య దూకుడు వల్ల కొత్త దర్శకులకూ మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందట.